Mehul Choksi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్ల పట్ల మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తూ వదిలేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చోక్సీపై గతంలో జారీచేసిన రెడ్కార్నర్ నోటీసును ఇంటర్పోల్ ఎత్తివేయడంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు నోరు మెదపకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరును ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. చోక్సీని దేశానికి రప్పించేందుకు తగిన ప్రయత్నాలు చేయకుండా దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో కేంద్రంలోని పెద్దల ప్రమేయం ఉన్నదా? అని ప్రశ్నిస్తున్నాయి. రెడ్కార్నర్ నోటీసు నుంచి చోక్సీ తప్పించుకొన్నాడా లేక తప్పించారా? అని విపక్ష పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో రెడ్కార్నర్ నోటీసుపై సీబీఐ మొక్కుబడిగా స్పందించిందనే విమర్శలు వస్తున్నాయి.
చోక్సీ ఆచూకీ కోసం సీబీఐ గతంలో ఇంటర్పోల్ను ఆశ్రయించగా అతనిపై రెడ్కార్నర్ నోటీసు జారీ చేసింది. తాజాగా చోక్సీపై ఆ రెడ్కార్నర్ నోటీసును ఇంటర్పోల్ ఎత్తివేసింది. దీంతో ఇంటర్పోల్లో సభ్యత్వం కలిగిన 195 దేశాలలో భారత్ మినహా చోక్సీ ఎక్కడికైనా వెళ్లే అవకాశం కలిగింది. రెడ్కార్నర్ నోటీసు ఉన్నట్లయితే అతన్ని ఇంటర్ పోల్ పరిధిలోని ఏ దేశంలోనైనా పట్టుకునే అవకాశం ఉండేది. మెహుల్ చోక్సీ 2018 జనవరిలో భారత్ నుంచి పారిపోయాడు. అంతకుముందే కరేబియన్ దేశం అంటిగ్వా బార్బుడాలో పౌరసత్యం తీసుకున్నట్టు బయటపడింది. ఈ దరఖాస్తును పరిశీలించకుండా రీజినల్ పాస్పోర్టు కార్యాలయం, పోలీసులు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారన్నది కూడా ప్రధానమైన ప్రశ్నే.
చోక్సీకి ఆంటిగ్యా-బార్బుడా దేశం పౌరసత్వం ఎలా ఇచ్చిందని ఆ దేశ ప్రధాని గాస్టన్ బ్రౌన్ను మీడియా ప్రశ్నించగా, దీంట్లో తమ తప్పేమీ లేదని అన్నారు. తమ దేశ పౌరసత్వం కోసం సమర్పించిన అన్ని పత్రాలకు భారత్ క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. తాము పౌరసత్వం ఇవ్వడం తప్పు అయితే అన్ని పత్రాలకు క్లియరెన్స్ ఇచ్చిన భారత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గాస్టన్ బ్రౌన్ స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులను వేధించడానికే తప్ప దేశం నుంచి పారిపోయిన వారి విషయంలో ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ‘సీబీఐ, ఈడీలు విపక్ష నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. ఐదేండ్ల కిందట దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీని దేశానికి రప్పించడానికి ఇంకెంత సమయం పడుతుందని ఆయన తన ట్వీట్లో ప్రధానిని ఉద్దేశించి ప్రశ్నించారు.