ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్
కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పోటాపోటీగా ఆడియో లీకులు చేస్తున్నాయి. శనివారం కూడా బీజేపీ ఓ ఆడియోను లీక్ చేసి ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేసింది. ‘బెంగాల్లో మమత ఎంత పాపులరో.. ప్రధాని మోదీ కూడాఅంతే పాపులర్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది’ అంటూ తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతున్నట్లుగా ఉన్న ఆడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్లో బయటపెట్టారు. ఈ ఎన్నికల ద్వారా నిరుపయోగమైన తృణమూల్ను ఇక వదిలించుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే తాను మాట్లాడిన మాటల్లోని అక్కడక్కడి పదాలను కలిపి ఆడియోను రూపొందించారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. మొత్తం ఆడియోను విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. బెంగాల్లో బీజేపీ 100 సీట్ల కన్నా ఎక్కువ గెలువలేదని పునరుద్ఘాటించారు.