న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో దొంగలు రెచ్చిపోయారు. ఆప్ ఎమ్మెల్యే సహా ఆ పార్టీకి చెందిన 20 మంది నేతల మొబైల్ ఫోన్లను చోరీ చేశారు. ఢిల్లీలోని మల్కా గంజ్ ప్రాంతంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు జరుగనున్నాయి. ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ మధ్య గట్టి పోటీ నెలకొన్నది.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బుధవారం మల్కా గంజ్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేబు దొంగలు రెచ్చిపోయారు. సాధారణ ప్రజలతోపాటు ఆప్ నేతల జేబులను లూఠీ చేశారు. ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి సహా 20 మంది నేతల మొబైల్ ఫోన్లు చోరీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి, పార్టీ నాయకురాలు గుడ్డీ దేవి, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి కార్యదర్శి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ డీసీపీ సాగర్ కల్సి తెలిపారు.