లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శలు చేయడం జరిగింది కానీ.. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్యే వార్ నడుస్తోంది. ఇద్దరు నేతలూ సూటిగానే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. దీంతో లౌడ్ స్పీకర్ల అంశం పక్కకు మళ్లి, వీరిద్దరి విమర్శలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా… మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే నేరుగా సీఎం ఉద్ధవ్పై విరుచుకుపడ్డారు. ఓ లేఖ కూడా రాశారు. తమ కార్యకర్తలను సీఎం ఉద్ధవ్ ఇబ్బందులు పెడుతున్నారని రాజ్ థాకరే ఆరోపించారు. తమ ధైర్యాన్ని పరీక్షించవద్దని అన్నారు. అధికారం నేడు ఉంటుంది, రేపు పోతుందని, తమ ధైర్యాన్ని మాత్రం పరీక్షించవద్దని రాజ్ థాకరే స్పష్టం చేశారు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో గానీ, మారణాయుధాలు దాచి వున్న చోట నుంచి వాటిని వెలికితీసే విషయంలో ప్రభుత్వం ఇంత శ్రద్ధ వహించిందా? అంటూ ప్రశ్నించారు.
రాజకీయాల్లో ఎవ్వరు కూడా శాశ్వతంగా అధికారంలో వుండరని, అధికారం వస్తుంది, పోతుందని లేఖలో రాజ్ థాకరే అన్నారు. పోలీసుల బలంతో తమ కార్యకర్తలను, నేతలను అరెస్ట్ చేస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజ్ థాకరే ఆ లేఖలో మండిపడ్డారు.