చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, ప్రతిపక్ష డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు ఇద్దరు టీవీకే మంత్రులకు పరువునష్టం నోటీసులు పంపారు. ఆ మంత్రులు తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. (Stalin’s Son-In-Law) 15 రోజుల్లోగా వారు క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి చెందిన మంత్రి ఆదవ్ అర్జున ఇటీవల మీడియా సమావేశంలో స్టాలిన్ కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో 36 శాఖలకు చెందిన డీఎంకే మంత్రులంతా అవినీతి ద్వారా డబ్బు వసూలు చేశారని ఆయన విమర్శించారు. చెరో 16 శాఖలకు చెందిన డబ్బును స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన అల్లుడు శబరీసన్కు పంచారని ఆయన ఆరోపించారు.
కాగా, మరో మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ కూడా గత డీఎంకే ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ ఆదాయం, వ్యయంతో పాటు అప్పులు కూడా భారీగా పెరిగాయని మీడియా సమావేశంలో విమర్శించారు. ‘విద్యుత్ బిల్లుల పెంపు వల్ల ఎవరు లబ్ధి పొందారు? ఆ (స్టాలిన్) కుటుంబమా? అల్లుడా? లేక కుమారుడా? అనే విషయాన్ని గత ప్రభుత్వ మంత్రులనే మనం అడగాలి’ అని అన్నారు.
మరోవైపు మంత్రులు ఆదవ్ అర్జున, నిర్మల్ కుమార్ చేసిన ఈ ఆరోపణలను స్టాలిన్ అల్లుడు శబరీసన్ తీవ్రంగా పరిగణించారు. ఆ ఇద్దరు మంత్రులు తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. అనేక ప్రాంతీయ ఛానెల్స్తో పాటు సోషల్ మీడియాలో ఈ వార్తలు ప్రసారమైనట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ మంత్రులు 15 రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని శబరీసన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరు మంత్రులకు లీగల్ నోటీసులు పంపారు.