చెన్నై : ఉమ్మడి పౌరస్మృతిపై (యూసీసీ) ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనను కాంగ్రెస్ సహా ఆ పార్టీ భాగస్వామ్యపక్షం డీఎంకే ఆక్షేపించాయి. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందువులకు వర్తింపచేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) సారధ్యంలోని డీఎంకే పట్టుపట్టింది. ఆపై అన్ని కులాల వారిని ఆలయాల్లోకి అనుమతించాలని కోరింది. ఉమ్మడి పౌరస్మృతిని ముందుగా హిందూ మతంలో ప్రవేశపెట్టాలి.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలందరినీ దేశంలోని ఏ ఆలయంలోనైనా పూజలు చేసేందుకు అనుమతించాలని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. ప్రతి మతానికి రాజ్యాంగం రక్షణ కల్పించినందునే తాము యూసీసీని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా దేశంలో పేదరికం, ధరల పెరుగుదుల, నిరుద్యోగ సమస్యలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిలదీశారు.
అల్లర్లతో భగ్గుమంటున్న మణిపూర్పై ఆయన ఎన్నడూ మాట్లాడరని, ఈ అంశాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తారని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో భాగమైన ఉమ్మడి పౌరస్మృతి అమలును ప్రధాని ప్రస్తావిస్తూ కుటుంబంలోని సభ్యులకు విభిన్న నియమాలు ఉండవని, రెండు చట్టాలపై దేశం మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో భాగమైనప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ , ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రధాని ప్రశ్నించారు. తాను గతవారం పర్యటించిన ఈజిప్ట్లో ట్రిపుల్ తలాక్ను 80, 90 ఏండ్ల కిందటే రద్దు చేశారని గుర్తు చేశారు.
Read More :