చెన్నై : డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్ మాట్లాడుతూ ఓ పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు మనమంతా ఇక్కడ కలిశామని, ఇదే సమయంలో మరో మ్యారేజ్ హాల్లో ఏదో జరుగుతోందని ఆ విషయం మనకు అనవసరమని పేర్కొన్నారు.
ఎలాంటి తీర్మానాలు లేకుండానే ఏఐఏడీఎంకే కార్యవర్గ సమావేశం ముగియడాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను నాశనం చేయాలని చూసినవారు చివరకు ఎలా పతనమయ్యారో తాను చెప్పదలుచుకున్నానని అన్నారు.
ఏఐఏడీఎంకేలో పార్టీ నాయకత్వంపై ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్), కే పళనిస్వామి (ఈపీఎస్) వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నాయకత్వ సంక్షోభం వెంటాడుతోంది. ఒకే నాయకత్వం ఉండాలనే వాదనను ఈపీఎస్ వర్గం తెరమీదకు తీసుకురాగా ఓపీఎస్ వర్గీయులు చర్చలో పాల్గొనకుండా పార్టీ కార్యవర్గ సమావేశం నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది.