చెన్నై, ఏప్రిల్ 12 : ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్లు ఇచ్చినా హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడానికి అనుమతించబోమని స్టాలిన్ అన్నారు. హిందీ భాషను రుద్దేందుకు, రాష్ట్ర భాషా గుర్తింపును దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ఆదివారం పుదుక్కోైట్టెలో బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర విద్యను బలోపేతం చేయటమేగానీ, దానిని కాషాయీకరణ చేయటం కాదని అన్నారు. హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని వ్యాప్తి చేయడానికి కేంద్రం విధానపరమైన సాధనాలను వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. మూడు భాషల విధానాన్ని స్వీకరించడానికి నిరాకరించిన కారణంగానే, తమిళనాడుకు కేటాయించిన విద్యా నిధుల్లో రూ.2,000 కోట్లను నిలిపివేశారని ఆరోపించారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయేతో ఏఐఏడీఎంకే పెట్టుకున్న పొత్తుపైనా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.