హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి చరిష్మా లేకనే జమిలీ ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఓట మిని తప్పించుకోవాలని ఆ పార్టీ ఎత్తులు వేస్తున్నదన్నారు. జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం అనంతరం మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ వెంటనే విడుదల చేసి, 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్కి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం రికార్డు సృష్టించారన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ చీఫ్
జమిలి ఎన్నికలు జాతి ప్రయోజనాలకు వ్యతిరేకం. ఎప్పటినుంచో ప్రధాని మోదీ చేస్తున్న ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నం.
-శరవణ్, డీఎంకే ప్రతినిధి
జమిలి ఎన్నికలకు సిద్ధమే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ర్టాలకు ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించవచ్చు. కానీ మా పార్టీకలాంటి బాధేమీ లేదు.
-బద్రినారాయణ పాత్ర, బీజేడీ నేత