ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన సారధ్యంలోని శివసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. 30 ఏండ్ల కిందట సంస్కరణలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పారిశ్రామికవేత్తలను, వ్యాపారదిగ్గజాలను దూషిస్తోందని, వ్యాపారులను దేశ విద్రోహులుగా వ్యవహరిస్తోందని అన్నారు.
దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే సలహాలు ఇచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పినా, చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందని ఆక్షేపించారు. అభివృద్ధి రాజకీయాల దిశగా మళ్లేందుకే తాను కాంగ్రెస్ను వీడి సేనలో చేరానని మిలింద్ దేవరా చెప్పుకొచ్చారు. 1968లో తన తండ్రి కాంగ్రెస్లో చేరినప్పటికీ 2004లో తాను చేరినప్పటికీ మధ్య కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు వచ్చాయని మిలింద్ దేవరా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు కేంద్రంగా మారడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇక మిలింద్ దేవరా కాంగ్రెస్కు రాజీనామా చేసి తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. దేవరాకు కాషాయ పతాకాన్ని అందించి ఆయనను శివసేనలోకి లాంఛనంగా షిండే ఆహ్వానించారు.
Read More :