ముంబై : మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ర్టలో కరోనా వైరస్ వ్యాప్తికి వలస కార్మికులే కారణమని ఆయన అన్నారు. వలస కార్మికుల వల్లే గత కొద్ది వారాల నుంచి మహారాష్ర్టలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందన్నారు. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికీకరణ రాష్ర్టమైన మహారాష్ర్టకు ఇతర రాష్ర్టాల కార్మికులందరూ తరలివస్తున్నారు. ఈ క్రమంలో వారందరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించాను. కానీ ప్రభుత్వం కొవిడ్ టెస్టులు చేయడంలో విఫలమైందని రాజ్ థాకరే ధ్వజమెత్తారు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయి. వారంతపు లాక్డౌన్తో పాటు రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది. వారమంతా పగటిపూట 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో ఐదుగురి కంటే ఎక్కువమంది ఒకచోట కలిసి ఉండకూడదు.
షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలకు పార్శిళ్లు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. పని ప్రదేశాల్లో కార్మికులకు నివాస సదుపాయం ఉంటేనే భవన నిర్మాణాలను అనుమతిస్తారు. సినిమా, డ్రామా థియేటర్లు, పార్కులు, క్రీడా మైదానాలను తెరువరు. పరిమిత సిబ్బందితో సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్వోపీలు) పాటించాలి. ప్రజా రవాణా వ్యవస్థ యథావిధిగా పనిచేస్తుంది అని మహారాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..