Jairam Ramesh : కేంద్ర ప్రభత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)’ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇవాళ మరోసారి మండిపడింది. తాము తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పరివర్తనాత్మక చట్టమని, కేంద్ర తీసుకొచ్చిన కొత్త పథకం ఒక లోపమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) అన్నారు. పాత పథకాన్ని కొత్త పథకం బుల్డోజ్ చేసిందని ఆరోపించారు.
ఇవాళ్టికి సరిగ్గా 20 ఏండ్ల క్రితం తాము MGNREGA పథకాన్ని తీసుకొచ్చామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బద్నపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించామని జైరామ్ రమేశ్ గుర్తుచేశారు. ఈ 20 ఏండ్లలో గ్రామీణ ప్రజలకు ఈ పథకం 180 కోట్ల పనిదినాలను కల్పించిందని తెలిపారు. అంతేగాక దాదాపు 10 కోట్ల సామాజిక ఆస్తులను సృష్టించిందని చెప్పారు.
అంతేగాక ఈ పథకం వలసలను తగ్గించిందని, గ్రామపంచాయతీలను బలోపేతం చేసిందని, గ్రామీణ పేదలు అధిక వేతనాలు పొందే శక్తిని ఇచ్చిందని జైరామ్ రమేశ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు బదిలీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధి హామీ పథకం కింద సన్నకారు రైతులకు వారి సొంతభూముల్లో బావులు తవ్వడం లాంటి సాగునీటి సదుపాయాలు సమకూరాయని తెలిపారు.