శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు షాక్ ఇచ్చారు. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప పీడీపీకి మరో మార్గం లేదని అన్నారు.
కాగా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నిర్ణయంపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సొంత అభ్యర్థులను పోటీకి దించుతున్న ఆమె బహుశా ఎలాంటి పొత్తు కోరుకోవడం లేదని విమర్శించారు. మొత్తం 5 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటే అది ఆమె ఇష్టమని అన్నారు. ముఫ్తీ ఫార్ములా ఆధారంగానే తాము కశ్మీర్లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. ‘ఇండియా’ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా జమ్ములోని రెండు స్థానాలను కాంగ్రెస్కు వదిలిపెట్టినట్లు చెప్పారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తు అక్కర్లేదని మెహబూబా ముఫ్తీ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నదని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. ‘మేం తలుపులు తెరిచి ఉంచాం. ఇప్పుడు ఆమె మూసి వేస్తే అది మా తప్పు కాదు’ అని మీడియాతో అన్నారు.
#WATCH | National Conference leader Omar Abdullah says, "…If she (PDP chief Mehbooba Mufti) has announced to field candidates on all 5 seats, it is her choice. We have fielded candidates on 3 seats in Kashmir based on her formula…If she is fielding her own candidates then… pic.twitter.com/EZJCeuU2LF
— ANI (@ANI) April 3, 2024