Sakshi Dhoni | ఈ ఐపీఎల్ సీజన్ (IPL 2024)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మళ్లీ ఫామ్లోకి వచ్చింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 213 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్లో చెన్నై జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ (Sakshi Singh Dhoni) చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ‘ప్లీజ్ ఇవాళ మ్యాచ్ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే (Baby Is On The Way), కాబోయే అత్తగా నా అభ్యర్థన ఇదే’ అని సాక్షి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్టు పెట్టింది. ఇది చూసిన ధోనీ అభిమానులు సాక్షి పోస్ట్ను వైరల్ చేయడమే కాకుండా.. మామ కాబోతున్న మిస్టర్ కూల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక, ఈ సీజన్లో ముందు బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఛేదనలో మాత్రం వరుసగా రెండోసారి చేతులెత్తేసింది. ఉప్పల్లో బెంగళూరుతో ఆడిన గత మ్యాచ్ మాదిరిగానే చెపాక్ (చెన్నై) లోనూ తడబడింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సమిష్టి ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్పై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
Also Read..
Amit Shah | ఎన్నికల వేళ అమిత్ షా నకిలీ వీడియోలు కలకలం.. ఎఫ్ఐఆర్ నమోదు
Smriti Irani | అమేథిలో స్మృతి ఇరానీ స్కూటర్ రైడ్.. ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్ర మంత్రి