న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందువులు, ముస్లింల మధ్య విద్వేషం రగిలిస్తూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కశ్మీర్ పండిట్లకు చెందిన యువకుడి హత్య నేపధ్యంలో కశ్మీర్లోని ముస్లింలు అక్కడి మైనారిటీలకు బాసటగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మోదీ సర్కార్ తన వైఫల్యాలను మరుగునపడేలా హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతోందని, ఇరు వర్గాలను ఒకరికి ఒకరిని శత్రువులుగా చూపుతోందని మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా అన్ని వర్గాల వారు సామరస్యంగా ఉంటారని పేర్కొన్నారు.
కశ్మీర్లో లోయలో నివసించే పండిట్లు, సిక్కులకు కశ్మీర్లోని ముస్లింలు అండగా నిలవాలని ఆమె కోరారు. 1947లో కశ్మీర్లోని ముస్లిమేతర ఆస్తులు, ప్రాణాలను మనం కాపాడిన తరహాలోనే మరోసారి కశ్మీర్లోని మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవాలని మెహబూబా ముఫ్తీ స్ధానిక ముస్లింలకు పిలుపు ఇచ్చారు.