న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 75 ఏండ్లుగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన పార్లమెంటు పాత భవనం ఇకనుంచి పార్లమెంటరీ చరిత్రకు సాక్షీభూతంగా నిలువనున్నది. మంగళవానం నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం వినాయక చవితి పర్వదినాన పాత పార్లమెంటు భవనంలో ప్రారంభం కాగా, మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారాయి. ఈ ప్రహసనం యావత్తు ప్రధాని నరేంద్రమోదీ చుట్టే తిరిగింది. దేశ ప్రజాస్వామ్యానికి తానే కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా, తానొక్కడే దిక్కు అన్నట్టుగా సాగుతున్నాయి. కొత్త భవనంలో తొలి బిల్లుగా చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అభియాన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
సోమవారం సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వ ఘనతలను, తన ఘనతలను చెప్పకనే చెప్పారు. ఇక పాత భవనంలో సమావేశాలు మొదలు కాగానే భారత ప్రజాస్వామ్య చరిత్ర అవలోకనం పేరుతో తనకు తానే గొప్పలు పోయారు. గతంలో పనిచేసిన ప్రధానులకంటే తానే గొప్పవాడిని అన్నట్టుగా స్వడబ్బా కొట్టుకొన్నారు. ఉభయ సభల్లోనూ మోదీ ప్రసంగం మొత్తం ఇలాగే సాగింది. అవసరం లేకపోయినా సోమ, మంగళవారాల్లో పార్లమెంటులో ఏకంగా ఐదుసార్లు ప్రసంగించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ఉపరాష్ట్రపతి ధన్కడ్కుగానీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకుగానీ పెద్దగా ప్రాధాన్యమే లభించలేదు. సమావేశాల్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు మాట్లాడినప్పటికీ వారి ప్రసంగాలకు కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది.
మంగళవారం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఉభయ సభల సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్కు ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. మళ్లీ ప్రధాని మోదీయే వన్మ్యాన్ షో చేశారు. గతమంతా ఒక ఎత్తు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా మాట్లాడారు. ఇక కొత్త భవనంలో రెండు సభల్లోనూ ప్రధాని ప్రసంగించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతూ..‘నారీమణుల కోసం నేను చేసిన గొప్ప కార్యాల వల్లనే మహిళా బిల్లుకు చట్టరూపం ఇచ్చేందుకు దైవం నన్ను ఎంచుకొన్నాడు’ అని చెప్పుకొన్నారు. గత చెడు ఘటనలన్నింటినీ మర్చిపోయి కొత్త భవనంలో సుహృద్భావ దృక్పథంతో కలిసి దేశం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు వినాయక చవితి, సంవత్సరి పర్వ, మిచ్చమి దుఃఖం (జైనుల పర్వదినం) శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొదటి రెండు రోజులూ ప్రధాని ప్రసంగాలు మొత్తం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసమే అన్నట్టుగా సాగాయి. సందర్భం వచ్చిన ప్రతిసారీ మహిళలకు తనంత గొప్పగా మరెవరూ సేవ చేయలేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. 1996 నుంచి నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పూర్తిగా తన ఘనతే అని ప్రచారం చేసుకొన్నారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ ప్రజలను వినూత్నంగా క్షమాపణలు కోరారు. తన హయాంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జైనుల సంప్రదాయంలో ఎంపీలు, దేశ ప్రజలను వేడుకున్నారు. ఈ మేరకు జైనుల సంప్రదాయంలో ‘మిచ్చమి దుక్కడం’ అంటూ వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకున్నది. ‘ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాలి. జైనుల సంప్రదాయం ప్రకారం ‘మిచ్చమి దుక్కడం’ అని మిమ్మల్ని వేడుకుంటున్నా’ అని ప్రధాని మోదీ తెలిపారు. కాగా, మిచ్చమి దుక్కడం అనేది జైనుల సంప్రదాయం ప్రకారం క్షమాపణలు కోరే విధానం. మిచ్చమి అంటే ‘నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అర్థం. దుక్కడం అంటే ‘బాధ వ్యర్థం కావచ్చు’ అని అర్థం వస్తుంది. జైనులు నిర్వహించుకునే పర్యుషన్ పండగ సందర్భంగా ఎనిమిది లేదా చివరి రోజున జరిగే సంవత్సరీ కార్యక్రమం అనంతరం జైనులు మిచ్చమి దుక్కడం అంటూ క్షమాపణలు కోరుకుంటారు.