న్యూఢిల్లీ : ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసిన కేసులో నిందితుడు, రెస్టారెంట్ల యజమాని నవనీత్ కల్రాకు కాంగ్రెస్ నేతలతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులు, అక్రమ లావాదేవీలు చేపట్టే వారితో కాంగ్రెస్ కుమ్మక్కవుతుందని ఆమె మండిపడ్డారు. రూ 13 కోట్ల విలువైన 7500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సీజ్ చేసిన కేసులో నవనీత్ కల్రా నిందితుడని ఆయనకు కాంగ్రెస్ తో నేరుగా సంబంధాలున్నాయని చెప్పారు.
ఆక్సిజన్ కొరతపై రాహుల్ గాంధీ ఆయన స్నేహితులు గగ్గోలు పెడుతున్నారని మరోవైపు నిందితుడి రెస్టారెంట్ చెఫ్ రాహుల్, సోనియా గాంధీలతో ఫోటోలు దిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2005-06లో నవనీత్ కల్రాకు ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సభ్యత్వం ఇప్పించారని ఆరోపించారు. బ్లాక్ మార్కెటీర్లు, దళారీలతో కాంగ్రెస్ అంటకాగేందుకు ఆ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వీ మధ్యవర్తిత్వం నెరపుతారని మీనాక్షి లేఖి ఆరోపించారు.