న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో సీట్ లీవింగ్ బాండ్ విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. విద్యార్థులకు సహాయకరమైన వాతావరణాన్ని సృష్టించడంతోపాటు వారి మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చేయూతనిచ్చేందుకు ఈ విజ్ఞప్తి చేసింది. తమ రాష్ట్రంలో సీటును వదులుకోవాలనుకునే విద్యార్థులపై విపరీతమైన సీట్ లీవింగ్ బాండ్ను మోపడానికి బదులుగా మరుసటి ఏడాదికి వారిని అడ్మిషన్ నుంచి డిబార్ చేసే అంశాన్ని రాష్ర్టాలు పరిశీలిచాలని ఎన్ఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇటీవల సిఫారసు చేసింది.
ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులకు ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ వీ వాణికర్ ఈ నెల 19న లేఖ రాశారు. దేశవ్యాప్తంగా వివిధ వైద్య విద్యా సంస్థల్లో విద్యార్థులు, ముఖ్యంగా పీజీ స్టూడెంట్లు ఆందోళనకర స్థాయిలో మానసిక ఒత్తిడిని, నిస్పృహను ఎదుర్కొంటున్నట్టు ఎన్ఎంసీకి ఫిర్యాదులు అందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది బాధిత విద్యార్థులపై ఆర్థికంగా ఒత్తిడిని పెంచుతున్నదని ఆమె తెలిపారు.