CM Siddaramaiah | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో ఒకటైన ‘గృహలక్ష్మీ’ స్కీమ్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. 2023 నవంబర్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు కారణాలతో ఈ పథకం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పథకం అమలు తీరుపై సీఎం సిద్ధరామయ్యకు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నికల హామీని పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై కొప్పల్ జిల్లాలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలతో సీఎం ఇరుకుపడ్డారు. ఈ సమయంలో ఆయన పక్కన ఉన్న జిల్లా కలెక్టర్ వైపు చూడగా.. లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని విడతల వారీగా అందజేస్తున్నట్టు ఆ అధికారి సీఎంకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ తీరుపై బీజేపీ మండిపడింది.
తప్పులు హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. రాష్ట్రంలో తప్పుడు పాలన సాగిస్తున్నదని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు. గత మూడు నెలలుగా గృహలక్ష్మి యోజన పథకం తమకు ఎటువంటి లబ్ధి అందడం లేదని కొప్పల్ జిల్లా మహిళలు చెబుతున్నారని, దీనిపైనే మీడియా ప్రతినిధులు సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే విడతల వారీగా అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ సీఎంకు చెప్పారని, అయితే వాస్తవమేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.