న్యూఢిల్లీ : జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన అధికారిక ఆహ్వాన పత్రంలో ‘భారత్’ అనే పదాన్ని వాడటంతో నెలకొన్న వివాదంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పందించారు. ఈ అంశంపై విపక్ష కూటమితో పాటు పాలక ఎన్డీయేపైనా ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం ద్వారా రాజ్యాంగంలో మార్పులు చేసేలా కేంద్రంలోని పాలక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాయని మాయావతి బుధవారం మండిపడ్డారు.
ఈ విషయంలో పాలక, విపక్షాల ప్రమేయంపై ప్రజలు కలత చెందుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశం పేరుతో ఏర్పాటైన పార్టీలు, కూటములు, రాజకీయ పార్టీలను నిషేధించేలా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సమోటోగా చొరవ చూపాలని కోరారు. ఇండియా, ఎన్డీయే రెండు కూటములకూ సమాన దూరం పాటించాలని తమ పార్టీ తీసుకున్న వైఖరి సరైనదేనని ఇప్పుడు రుజువైందని మాయావతి పేర్కొన్నారు.
విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం దేశం పేరును భారత్గా మార్చేందుకు రాజ్యాంగంలో మార్పులు చేపట్టేందుకు పూనుకోవడం కుట్రగా అభివర్ణించారు. ఇది పధకం ప్రకారం విపక్ష, పాలక పక్ష కుట్రని మాయావతి ఆరోపించారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఎన్నికల ముందు మరుగుపరిచి, ఎలాంటి అంశాలను విపక్ష, పాలక పక్షాలు ముందుకు తెస్తున్నాయో ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పారు. విపక్ష, పాలకపక్ష కూటముల రాజకీయాలు ప్రజా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటివని మాయవతి వ్యాఖ్యానించారు.
Read More :