చెన్నై: దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న సుమారు 15.75 లక్షల మంది విద్యార్థులకు ఉదయం వేళ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఆగస్టు 25న సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.
కాగా, కరూర్ జిల్లా వేలన్ చెట్టియార్ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న 30 మంది విద్యార్థులలో 15 మంది అల్పాహారం తినడానికి నిరాకరించారు. దళిత మహిళ సుమతి అల్పాహారాన్ని తయారు చేయడంపై 15 మంది హిందూ విద్యార్థులకు చెందిన తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వంట మనిషిని మార్చాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తినరని స్కూల్ సిబ్బందికి చెప్పారు. ఒకవేళ అల్పాహారం తినాలని బలవంతం చేస్తే తమ పిల్లలను స్కూల్ మాన్పిస్తామని అన్నారు.
మరోవైపు ఈ విషయం జిల్లా కలెక్టర్ ప్రభు శంకర్కు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ స్కూల్ను ఆయన సందర్శించారు. అల్పాహార పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ తినని 15 మంది పిల్లల తల్లిదండ్రులను స్కూల్కు పిలిపించి మాట్లాడారు. అందరితోపాటు వారి పిల్లలు కూడా అల్పాహారం తినేలా ప్రోత్సహించాలని కోరారు. కుల వివక్ష చూపితే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.