న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెలలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది సైనిక సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాదిలో చివరిదైన మన్ కీ బాత్లో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి రేడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లేఖ సారాంశాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది శౌర్య చక్ర అవార్డు పొందిన ఆయన ఈ విషయాన్ని లేఖ ద్వారా తన స్కూల్ ప్రిన్సిపాల్కు తెలిపారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ లేఖ గురించి తనకు తెలిసిందన్నారు. ఒక సాధారణ వ్యక్తిని అసాధరణ వ్యక్తిగా మార్చిన వరుణ్ సింగ్ మంత్రాన్ని మోదీ ప్రశంసించారు. విజయాల శిఖరానికి చేరుకున్న తర్వాత కూడా తన మూలాలను ఆయన మర్చిపోలేదన్నారు. శౌర్య చక్ర అవార్డు పొందిన ఆనందాన్ని తన స్కూల్ ప్రిన్సిపాల్తో పంచుకున్న వైనాన్ని, భావితరాలకు ఆ లేఖలో ఆయన ఇచ్చిన సందేశాన్ని మోదీ కొనియాడారు.