న్యూఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు అడుగంటాయని, వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు మరిన్ని వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియే కోరారు. ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు మరోసారి అయిపోయాయని, కేంద్రం ఒకట్రెండు రోజులకు సరిపోయేలా వ్యాక్సిన్ డోసులను పంపుతుండటంతో తాము వ్యాక్సిన్ కేంద్రాలను పలు రోజులు మూసివేయాల్సిన పరిస్ధితి నెలకొందని సిసోడియా ట్వీట్ చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా మందకొడిగానే ఎందుకు సాగుతోందని ఆయన ప్రశ్నించారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకూ 68,34,380 మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోగా 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రాల వద్ద ఇంకా 1.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 38.86 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేశామని వెల్లడించింది.