న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిసోడియా వ్యాఖ్యలను తోసిపుచ్చిన బీజేపీ అవినీతిలో ఆప్ రికార్డులను బ్రేక్ చేసిందని ఎక్సైజ్ పాలసీ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఇక ఇదే కేసులో సీబీఐ అధికారుల తీరును మనీష్ సిసోడియా తప్పుపట్టారు. తన భార్య, పిల్లల కప్బోర్డులను సీబీఐ తనిఖీ చేసిందని సిసోడియా పేర్కొన్నారు. సీబీఐ తీరు తనను బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (2021-22)లో అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు శుక్రవారం సిసోడియా నివాసంపై దాడులు చేపట్టారు.
మరోవైపు మహారాష్ట్ర, కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్లో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ సీబీఐ-ఈడీలను ప్రయోగించిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.