Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపిన విషయం తెలిసిందే. ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని, వారు 400 కిలోల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన ఒక బెదిరింపు హెచ్చరిక ముంబై పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వినాయక నిమజ్జనం వేళ ఈ బెదిరింపు మెయిల్ రావడంతో ముంబై పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడు బీహార్లోని పాటలీపుత్రకు చెందిన అశ్వినీ కుమార్గా గుర్తించారు. అతడిని నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఫిరోజ్ అనే వ్యక్తి తనపై 2023లో కేసు పెట్టాడని, దీంతో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు.. దీనికి ప్రతీకారంగానే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ మేరకు నిందితుడి నుంచి ఏడు మొబైల్ ఫోన్స్, మూడు సిమ్ కార్డ్స్, ఆరు మెమరీ కార్డ్స్ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికార వాట్సాప్ నంబర్కు శుక్రవారం ఒక బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. తాము పాకిస్థాన్కు చెందిన లష్కరే జీహాదీ గ్రూప్నకు చెందిన వారమని, 14 మంది ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, అనంత చతుర్దశి సందర్భంగా నగరంలోని 34 చోట్ల 34 మానవ బాంబులను మోహరించామని అందులో తెలిపారు. మానవ బాంబులతో కూడిన పలు వాహనాలను ముంబై నగరమంతా మోహరించామని, వారి వద్ద ఉన్న 400 కేజీల ఆర్డీఎక్స్ (400 kg RDX) వల్ల కోటి మంది మరణిస్తారని మెసేజ్లో బెదిరించారు. వెంటనే దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, ఇతర దర్యాప్తు సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
PM Modi | ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం : ప్రధాని మోదీ
PM Modi | వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
నటి శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు