అహ్మదాబాద్ : కొవిడ్ వ్యాక్సిన్ పోర్టల్ లోటుపాట్లకు పరాకాష్టగా ఓ ఉదంతం నిలిచింది. నెలల కిందట మరణించిన 70 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చినట్టు నమోదవడంతో అతని కుటుంబసభ్యులు విస్తుపోయారు. గుజరాత్లోని బనస్కంత జిల్లాలో మూడు నెలల కిందట మరణించిన తన తండ్రి హర్జి లక్ష్మణ్ పర్మార్కు కుమారుడు వెర్షిభాయ్ పర్మార్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే జులై 14న తన తండ్రికి విజయవంతంగా కరోనా రెండవ డోసు టీకా తీసుకున్నారని వెర్షిభాయ్ ఫోన్కు కొవిన్ వ్యాక్సిన్ పోర్టల్ నుంచి మెసేజ్ రావడంతో ఆయన కంగుతిన్నారు.
కొవిన్ వ్యాక్సిన్ పోర్టల్ నుంచి గతంలోనూ ఇలానే వ్యాక్సినేషన్కు సంబంధించి పలు తప్పుడు మెసేజ్లు వచ్చాయి. గతంలో వ్యాక్సిన్ డోసు తీసుకోనివారికి, మరణించిన వారికి వ్యాక్సిన్ డోసు తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ గుజరాత్లో పలువురికి మెసేజ్లు వచ్చాయి. తమ తండ్రి మూడు నెలల కిందటే కరోనాతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడని చెప్పిన వెర్షిభాయ్ ఇలాంటి మెసేజ్లు తమ గాయాలపై ఉప్పు వేసినట్టు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ తండ్రి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లనేలేదని, అసలు తొలి డోసు కూడా తీసుకోలేదని ఆయనకు సకాలంలో ఆక్సిజన్ బెడ్ దొరికిఉంటే ఆయన తమకు దక్కేవాడని కన్నీటిపర్యంతమయ్యాడు. సకాలంలో చికిత్స అందించేందుకు అవసరమైన బెడ్ లభించక ఓ వ్యక్తి మరణిస్తే విచిత్రంగా ఆయనకు కొవిడ్-19 వ్యాక్సిన్ వేసినట్టు చూపుతున్నారని అధికారాలు ఇలాంటి ఘనతను ఎలా సాధించారని వెర్షిభాయ్ నిలదీశారు.