Crime news : తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూరు (Coimbatore) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి నేరస్తుడు అని తెలిసి ఓ యువతి అతడిని దూరం పెట్టింది. అయితే తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల (Petrol Bombs) తో దాడికి పాల్పడ్డాడు. కోయంబత్తూరు సమీపంలోని తొండముత్తూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కార్తీ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. అయితే సదరు యువకుడికి నేరచరిత్ర ఉన్నదనే విషయం తెలుసుకున్న తర్వాత యువతి అతడిని దూరం పెట్టింది. ప్రేమించేందుకు నిరాకరించింది. దాంతో యువతిపై కోపం పెంచుకున్న కార్తీ తన స్నేహితుడితో కలిసి బైకుపై యువతి ఇంటివైపు వెళ్లాడు. వెంట తీసుకెళ్లిన రెండు పెట్రోల్ బాంబులను ఆ ఇంటిపై వేశాడు.
దాంతో యువతి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కార్తీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.