న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జల్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలయ్యాడు. తవ్వి వదిలేసిన గుంతలో బైక్తో సహా పడి అతడు మరణించాడు. విమర్శలు వెల్లువెత్తడంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. (man falls to death in open pit) ఢిల్లీలోని కైలాష్పురిలో నివసించే 25 ఏళ్ల కమల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రోహిణి బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధుల తర్వాత బైక్పై ఇంటికి బయలుదేరాడు.
కాగా, అర్ధరాత్రి దాటినప్పటికీ కమల్ ఇంటికి చేరుకోలేదు. అతడి ఫోన్ కూడా పనిచేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారంతా బయటకు వచ్చారు. సమీప ప్రాంతాల్లో కమల్ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో కమల్ సోదరుడు జనక్పురి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి కమల్ కోసం వెతికినా ఫలితం లేకపోయింది.
మరోవైపు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. రోడ్డు పక్కన ఉన్న 15 అడుగుల లోతైన గుంతలో బైక్, ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదవశాత్తు బైక్ ఆ గుంతలో పడటంతో కమల్ మరణించినట్లు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
అయితే, జల్ బోర్డ్ అధికారులు ఆ గుంతను తవ్వి పూడ్చకుండా వదిలేసినట్లు తెలిసింది. దీంతో వారి నిర్లక్ష్యానికి ఒక యువకుడు బలికావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రి ఆశిష్ సూద్ దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత బాధ్యులైన ముగ్గురు ఢిల్లీ జల్ బోర్డు అధికారులను సస్పెండ్ చేశారు. ఇటీవల నోయిడాలో లోతైన నీటి గుంతలో కారుతో సహా పడి ఒక వ్యక్తి మరణించిన సంఘటనను ఇది తలపించింది.
Also Read:
Watch: టీచర్ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్
Watch: రోడ్డు మలుపులో ఆటోను క్రాస్ చేసిన స్కూటీ.. తర్వాత ఏం జరిగిందంటే?