తెలంగాణలో బ్రోకర్లు పట్టుబడ్డా..
జైళ్లలో చిప్పకూడు తింటున్నా..
న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా..
దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా..
మారని బీజేపీ కూల్చివేత రాజకీయం..
ప్రభుత్వాలను పడగొడతామంటూ మళ్లీ అవే బరితెగింపు మాటలు..
కోల్కతా, నవంబర్ 23: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.. దర్యాప్తు సంస్థలను ఎగదోయడం దాకా.. దాడుల పేరుతో తృణమూల్ నేతలను భయపెట్టడం దగ్గరనుంచి.. నేతల కుటుంబాల్లో చిచ్చు పెట్టడం దాకా.. మోదీ, షా నుంచి.. సువేందు అధికారి దాకా.. రోడ్డు షోలు మొదలుకొని.. వీధి నాటకాల దాకా చేయని ప్రయత్నమంటూ లేనేలేదు. ఇన్ని చేసినా.. బెంగాల్లో ప్రజలు మమతాబెనర్జీకి ఏకంగా నాలుగింట రెండు వంతుల తిరుగులేని మెజార్టీని కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు.
ఈ కేంద్ర ప్రభుత్వ బ్రోకర్లు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ఎరవేసి అడ్డంగా దొరికిపోయారు. జైల్లోపడి చిప్పకూడు తింటున్నారు. విచారణను ఆపడానికి కోర్టు చుట్టూ తిరిగితే.. అక్షింతలు తప్పడం లేదు. ఆరేడు రాష్ర్టాల్లో కేసులు పెట్టే పరిస్థితి. తెలంగాణలో బీజేపీ బ్రోకర్ల బాగోతంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పలు రాష్ర్టాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలు పడగొట్టిన తీరు విస్మయం గొలుపుతున్నది. మీడియా సంస్థలు నిర్వహిస్తున్న పరిశోధనల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ఇంత జరుగుతున్నా.. బీజేపీ కానీ, ఆ పార్టీ నేతల బుద్ధి కానీ మారనేలేదు. ఇప్పటికిప్పుడు పశ్చిమబెంగాల్లోటీఎంసీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు తొడలు కొడుతున్నారు. తమ నైజం ఏమిటో ప్రపంచానికి నగ్నంగా బయటపడిన తరువాత కూడా బీజేపీ అధిష్ఠానంలో కానీ.. ఆ పార్టీ నేతల్లో కానీ కించిత్ మార్పు కూడా రాలేదు. డిసెంబర్లోగా దీదీ సర్కారును కూలుస్తమని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ నిస్సిగ్గుగా చెప్తున్నారు.
ఇలాంటి వీళ్లను ఏం చేయాలి?
ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డిసెంబర్లో పెద్ద ఆటే జరుగుతుంది
పశ్చిమబెంగాల్లో భారీ మెజార్టీతో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వ్యూహరచన చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఏఎన్ఐ వార్తాసంస్థతో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తున్నది. ‘తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు.. డిసెంబర్లో బెంగాల్లో పెద్ద గేమ్ జరుగబోతున్నది. డిసెంబర్ తరువాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగబోదని ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. వాళ్ల అస్తిత్వం ప్రమాదంలో పడబోతున్నది’.. ఇదీ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో అన్న మాటలు.. బీజేపీ కూల్చివేత రాజకీయాలపై ప్రకంపనలు రేపుతున్నాయి. తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వెనుక తమ వ్యూహం ఏమిటో చెప్పేది లేదని, ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిలో 50 శాతం మంది జైళ్లలో ఉన్నారని.. మిగతావాళ్లు కూడా జైళ్లకు పోతారని అగ్నిమిత్ర పాల్ జోస్యం కూడా చెప్పారు. సరిగ్గా కొన్నాళ్ల క్రితం బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా ఈ తరహా వ్యాఖ్యానాలే చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అరెస్టు అవుతారని, 40 మంది టీఎంసీలు బీజేపీతో టచ్లో ఉన్నారని, డిసెంబర్లో ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా పేర్కొన్నారు. అంతకుముందు నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి.. తనతో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇంకాస్త ముందుకు వెళ్లి మమత ప్రభుత్వం ఆరు నెలలకు మించి అధికారంలో ఉండదని తెలిపారు. ఈడీ, సీబీఐ సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని.. మమత ప్రభుత్వానికి డిసెంబర్ డెడ్లైన్ అని కూడా అన్నారు. బీజేపీ నేతలందరూ డిసెంబర్ నెలలోనే దీదీ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తుండటంతో బెంగాల్ రాజకీయ వర్గాల్లో బీజేపీ పన్నాగంపై అనుమానాలు బలపడుతున్నాయి.
294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి నిరుడు జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందు నానా రకాల డ్రామాలు, ఈడీ, సీఐడీ దాడులు.. బెదిరింపులతో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. బీజేపీ తన బలాన్ని పెంచుకోగలిగిందేమో కానీ.. తృణమూల్ ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయింది. సాధారణ మెజార్టీ రావాలంటే.. 148 స్థానాలు కావాల్సి ఉంటుంది. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీకి 71 సీట్ల దూరంలో ఉన్నది. అయినప్పటికీ.. మూడింట రెండు వంతులకు పైగా మెజార్టీతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని దొడ్డిదారిన కూల్చడానికి కుట్రలు చేస్తున్నట్టు బీజేపీ నేతలే నిస్సిగ్గుగా చెప్తున్నారు.