కోల్ కతా : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సాగిన హోరాహోరీ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
మొత్తం 292 అసెంబ్లీ స్ధానాలకు గాను టీఎంసీ 187 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం 98 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు నాలుగు స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక సీఎం మమతా బెనర్జీ నందిగ్రాంలో బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై వెనుకంజలో ఉన్నారు. క్రికెటర్ మనోజ్ తివారీ (టీఎంసీ) ఆధిక్యంలో ఉండగా బీజేపీ నుంచి లాకెట్ ఛటర్జీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో వెనుకపడ్డారు.