కోల్కతా : నూతన పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు కిందకు దూకి గ్యాస్ను వదలడం భద్రతా వైఫల్యమేనని, ఇది చాలా తీవ్రమైన అంశమని ఆమె పేర్కొన్నారు. బుధవారం లోక్సభలో జీరో అవర్ సమయంలో ఇద్దరు వ్యక్తులు సభలో పసుపు రంగు గ్యాస్ను వదలడం తీవ్ర కలకలం రేపింది.
స్లోగన్లు చేస్తూ సభలో దుమారం రేపిన వీరిని ఎంపీలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్ర అంశమని, అధికార యంత్రాగం లోటుపాట్లు స్పష్టంగా బయటపడ్డాయని దీదీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అంగీకరించారని ఆమె గుర్తుచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వండని వ్యాఖ్యానించారు.
ఆరోగ్య కేంద్రాలకు కాషాయ రంగులు వేయాలని కేంద్రం ఆదేశాలపై దీదీ స్పందిస్తూ ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది కూడా బీజేపీ నిర్ణయిస్తోందని మండిపడ్డారు. కాగా, విపక్ష ఇండియా కూటమి భేటీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లేందుకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More :