Mamata Banerjee : బీజేపీ సమాజంలో విభజన చిచ్చు రేపుతూ రాజ్యాంగ పరిమితులను యధేచ్చగా ఉల్లంఘిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మన సిక్కు సోదరుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఆమె ఖండించారు. బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ వీడియోను షేర్ చేస్తూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తలపాగా ధరించిన ప్రతి ఒక్కరినీ బీజేపీ ఖలిస్తానీ ముద్ర వేస్తుందని మండిపడ్డారు. బీజేపీ నేతలను సందేశ్ఖలి వెళుతుండగా అడ్డగించిన సిక్కు పోలీస్ అధికారితో ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ వాదించిన క్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి కోసం అసమాన త్యాగాలు చేసిన మన సిక్కు సోదరుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును తాను ఖండిస్తున్నానని, ఆ పార్టీ తలపాగా ధరించిన ప్రతి వ్యక్తిపైనా ఖలిస్తానీ ముద్ర వేస్తుందని మండిపడ్డారు.
బెంగాల్లో సామాజిక సామరస్యం కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, దీనికి విఘాతం కల్పించేందుకు చేపట్టే చర్యలను దీటుగా నిలువరిస్తామని ఆమె ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా సందేశ్ఖలిలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళలు ఆరోపించడం కలకలం రేపింది.