కోల్కతా : ధరల మంట ఊసెత్తితే ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు సహా నిత్యావసరాల ధరలను పెంచి సామాన్యులపై మోదీ సర్కార్ పెను భారం మోపుతోందని దీదీ మండిపడ్డారు.
గ్యాస్ సహా ఇంధన ధరలు, ఇతర వస్తువుల ధరలు పెంచి కేంద్రం ఖజానా నింపుకుంటోందని దుయ్యబట్టారు. మేదినిపూర్ కాలేజ్ గ్రౌండ్లో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజలను పీడిస్తున్న కీలక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని అన్నారు.
ధరల పెరుగుదలపై ప్రజలు నిరసనలకు సిద్ధపడిన ప్రతిసారీ మోదీ ప్రభుత్వం మత ఉద్రిక్తతలను సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్రం సామాన్యుడిని లూటీ చేస్తోందని దుయ్యబట్టారు. పెరిగిన ధరలతో సామాన్యుడి బతికే పరిస్ధితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.