కోల్ కతా : కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వ్యాక్సినేషన్ సరళీకరణ వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహం మార్కెట్ శక్తులకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన ఈ వారంలో రాసిన రెండవ లేఖలో దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి కొవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ తయారీదారులు వ్యాక్సిన్లతో వ్యాపారం చేయరాదని అన్నారు. మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కు మోదీ సర్కార్ అనుమతించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ కంపెనీలు నేరుగా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి వ్యాక్సిన్ డోసులను సేకరించే వెసులుబాటు కేంద్రం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ కొవిడ్ వ్యూహం వివక్షతో కూడుకున్నదని మార్కెట్ శక్తులకు లాభాలు ఆర్జించేలా ఉందని దీదీ ఆక్షపించారు.