కోల్కతా, మే 23: ప్రజలు ఓటు వేసి అధికారం ఇవ్వకున్నా.. విపక్ష పాలిత రాష్ర్టాలపై కూడా పెత్తనం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ, ఆర్డినెన్స్లు వంటి ద్వారా అన్ని రాష్ర్టాలను పాలించాలని కేంద్రం అనుకొంటున్నదని, సుప్రీంకోర్టు తీర్పులన్నా బీజేపీ ప్రభుత్వానికి గౌరవం లేదని దుయ్యబట్టారు. ‘వారు(బీజేపీ) ఏం అనుకొంటున్నారు? మేమేమైనా వెట్టిచాకిరి కార్మికులమా? వారి సేవకులమా?’ అని మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను తీవ్రంగా ఖండించిన మమత.. పార్లమెంట్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం మమతను కోల్కతాలో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఇతర నేతలు ఉన్నారు.
ఢిల్లీలో పాలనాధికారాల విషయంలో సుప్రీంకోర్టు చాలా బలమైన తీర్పునిచ్చిందని, అయితే కేంద్రం దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును కూడా లెక్కచేయడం లేదని మమత అన్నారు. ఈ విషయంలో విపక్షాలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని, దేశం పేరును కూడా మార్చుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని మమత విమర్శించారు. విపక్ష పాలిత రాష్ర్టాలపై వేధింపులకు పాల్పడుతున్నదని, అందుకు గవర్నర్ వ్యవస్థ, ఆర్డినెన్స్లు వంటి వాటిని ఉపయోగించుకొంటున్నదని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేస్తున్నారని, ఇది బుల్డోజర్ ప్రభుత్వమని విమర్శించారు.
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు పలికినందుకు కేజ్రీవాల్ ఈ సందర్భంగా మమతకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభలో గనుక ఈ బిల్లును ఆడ్డుకోగలిగితే.. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు అదే సెమీఫైనల్ అవుతుందని అభిప్రాయపడ్డారు. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాల పాలనకు గవర్నర్ల ద్వారా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కేజ్రీవాల్ మండిపడ్డారు. తన పోరాటం ఒక్క ఢిల్లీకి సంబంధించిందే కాదని, పశ్చిమబెంగాల్, పంజాబ్, తమిళనాడు వంటి అన్ని విపక్ష రాష్ర్టాల్లోనూ ఇలానే జరుగుతున్నదని అన్నారు.
దేశ రాజ్యాంగానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ప్రధాని, 30 మంది గవర్నర్లు దేశాన్ని, రాష్ర్టాలను పాలించాలని అనుకొంటే.. ఎన్నికలకు భారీ మొత్తంలో ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ అంటే ప్రభుత్వం అయితే.. కోట్లాది మంది ఎన్నికల్లో ఓటు ఎందుకు వేస్తున్నట్టు? అని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
కేజ్రీవాల్ బుధవారం శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను కలువనున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు.