రాయ్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Khrage) విమర్శలు గుప్పించారు. చత్తీస్గఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయని మోదీ తామే అన్నీ చేశామని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని పార్లమెంట్లో కూర్చునే బదులు డ్రామా కంపెనీలో చేరాలని హితవు పలికారు. రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటుంటే ఈశాన్య రాష్ట్రంపై నోరు మెదపని మోదీ నెహ్రూజీపై సెటైర్లు వేస్తారని మండిపడ్డారు. మోదీ అన్నీ తానే చేశానని చెప్పుకుంటాడని, చత్తీస్గఢ్లో విద్యుత్, స్కూళ్లు మోదీ ప్రధాని అయ్యాకే వచ్చాయా అని ఖర్గే ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసిన స్కూళ్లలో మోదీ, అమిత్ షా చదువుకున్నారని, వారేమైనా లండన్, ఆక్స్ఫర్డ్లో చదివారా అని నిలదీశారు.
గత 70 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని వారు ప్రశ్నిస్తారని, దేశంలో ప్రతి ఒక్కటీ తామే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఎన్నో నిర్మాణాలు చేపట్టామని ఖర్గే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ చేసిన పనులను బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. చైనా యుద్ధం గురించి పదేపదే ప్రస్తావించే బీజేపీ పాకిస్తాన్ను ఇందిరాగాంధీ రెండుగా విభజించిన విషయాన్ని విస్మరిస్తారని అన్నారు. కాషాయ పాలకులు ఓ పక్షిని కూడా వేటాడలేరని, ఇందిరా గాంధీ చొరవతో ఏర్పడిన బంగ్లాదేశ్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏలుబడిలో ఉన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.
Read More :