Krishneswara Rao | తెలుగు రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు నాటకరంగంలో ఓ విశిష్ట అధ్యాయం ముగిసినట్లైంది. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వరరావు పాఠశాల రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి నాటకం ‘వాపస్’. ఆ తర్వాత నాటకరంగమే తన జీవితంలో అంతర్భాగంగా మార్చుకున్నారు. నటుడిగా ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించిన ఆయన.. రచయితగా కూడా ఎన్నో సామాజిక అంశాలను నాటకాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
‘సంపద’, ‘రోజూ చస్తున్న మనిషి’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘అధికారి’, ‘నష్ట పరిహారం’, ‘భూమి కోసం’, ‘గుర్తు తెలియని శవం’ వంటి నాటకాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. తాను రచించిన నాటకాల్లో నటించడంతో పాటు వాటికి దర్శకత్వం వహించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. పొన్నూరు కళాపరిషత్ స్థాపనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయోగాత్మక నాటకాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృష్ణేశ్వరరావు పలు పురస్కారాలను అందుకున్నారు. ‘కూతురి కోసం’ నాటకంలో నటనకు గాను భారతముని అవార్డును సైతం అందుకున్నారు. రంగస్థలంపై ఆయన ప్రతిభను గుర్తించిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్రెడ్డి కృష్ణేశ్వరరావును సినీ రంగానికి పరిచయం చేశారు. ఆయన రచించిన ‘రోజూ చస్తున్న మనిషి’ నాటకాన్ని చూసిన ప్రభాకర్రెడ్డి.. ‘ప్రచండ భారతం’ చిత్రానికి సంభాషణలు రాసే అవకాశాన్ని కల్పించారు. దీంతో కృష్ణేశ్వరరావు సినీ రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు.
‘శ్రీరాములయ్య’, ‘భద్రాచలం’ చిత్రాలకు కథ అందించిన ఆయన.. ‘జయం మనదేరా’ మూవీ రైటింగ్ టీంలోనూ పనిచేశారు. ‘పరశురామ్’ చిత్రానికి సంభాషణలు రాయడంతో పాటు ‘నేను సైతం’ సినిమాకు పాటలు కూడా రాశారు. వృత్తిరీత్యా వైద్య రంగంతో అనుబంధం ఉన్నప్పటికీ సినిమాల కంటే నాటకరంగానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రంగస్థలంపై ఉన్న అంకితభావంతో సినీ రంగంలో వచ్చిన కొన్ని అవకాశాలను సైతం వదులుకున్న సందర్భాలు ఉన్నట్లు ఆయన గురించి ప్రచురితమైన వివరాలు చెబుతున్నాయి.
దర్శకుడు వంశీతో పరిచయం ఏర్పడిన తర్వాత కృష్ణేశ్వరరావు సినీ నటుడిగా కూడా పలు అవకాశాలు అందుకున్నారు. ‘కొంచెం టచ్లో ఉంటే చెప్తాను’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ‘వీర తెలంగాణ’, ‘సరదాగా కాసేపు’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘వశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర సినిమాల్లోనూ కనిపించారు. 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ చిత్రంలో బిచ్చగాడి పాత్రలో కృష్ణేశ్వరరావు అద్భుతంగా నటించారు. చిన్న పాత్ర అయినప్పటికీ తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఈ పాత్రకు గాను ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు నాటకరంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోనున్నాయి. కృష్ణేశ్వరరావు మృతితో తెలుగు రంగస్థలం ఓ ప్రతిభావంతుడైన కళాకారుడిని కోల్పోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.