ఇంఫాల్ : మణిపూర్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం రాష్ట్ర పోలీసులు నిలువరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. అల్లర్లతో అట్టుడికిన (Manipur Violence) ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనడం అవసరమని ఘర్షణ కాదని వ్యాఖ్యానించారు. సహాయ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను కలిసేందుకే రాహుల్ వెళ్లారని గుర్తుచేశారు. అలజడి చెలరేగిన మణిపూర్లో భీతిల్లిన ప్రజలకు సాంత్వన చేకూర్చడమే రాహుల్ పర్యటన ఉద్దేశమని వివరించారు. మణిపూర్ భగ్గుమంటున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరు మెదపడం లేదని ఖర్గే దుయ్యబట్టారు. రాహుల్ ప్రజలను కలిసేందుకు వచ్చినప్పుడు మాత్రం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణితో అడ్డగిస్తున్నాయని ఆరోపించారు.
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రభుత్వ తీరు అన్ని రాజ్యాంగ, ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు. రాజధాని ఇంఫాల్ విమానాశ్రయంలో విమానం దిగిన రాహుల్ గాంధీ అల్లర్లతో రగిలిన చురచంద్పూర్కు కారులో బయలుదేరారు. అక్కడి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అలాగే పౌర సమాజ ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
భద్రతాపరమైన కారణాలు, దాడులు జరుగవచ్చన్న అనుమానంతో రాహుల్ గాంధీ కాన్వాయ్ను బిష్ణుపూర్ ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సందర్శించనున్న ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గత రాత్రి కూడా అల్లర్లు జరిగినట్లు బిష్ణుపూర్ ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ కాన్వాయ్పై దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే ఆయన వాహన శ్రేణిని అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లో చురచంద్పూర్కు వెళ్లాలని భావిస్తున్నారు. రాహుల్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.
Read More :