న్యూఢిల్లీ : చైనా ఎయిర్పోర్ట్ను యూపీలో తమ ఎయిర్పోర్ట్గా బీజేపీ చూపుతోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ బీజింగ్ జనతా పార్టీగా మారిందని చురకలు వేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చైనాకు దాసోహమైందని, మన భూభాగంలో డ్రాగన్ గ్రామాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
యూపీలోని జెవార్ ఎయిర్పోర్టు ఫోటోలు విడుదల చేస్తూ చైనాలోని డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం చిత్రాలను బీజేపీ ప్రదర్శించిందని అన్నారు. మరోవైపు నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ధరల మంట, చైనా దూకుడు, పెగాసస్ స్పైవేర్, సాగు చట్టాల వంటి అంశాలతో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి.