Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఒక ప్రెస్మీట్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీని తీవ్రవాది అంటూ వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అన్నాదురై సిద్ధాంతాలకు కట్టుబడి, ఆయన ఫొటోను వాడుకుంటున్న ఏఐఏడీఎంకే పార్టీ మోదీతో ఎలా పొత్తుపెట్టుకుంటుంది..? మోదీ ఒక తీవ్రవాది. ఆయన పార్టీ సమానత్వం, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటిది వారితో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకుంది. అంటే వాళ్లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు. అన్నాదురై, కామరాజ్, పెరియార్, కళైంగర్, బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల్ని బలహీనపరుస్తున్నారు’’ అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. అయితే, మోదీ తీవ్రవాది అంటూ తను చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తర్వాత వివరణ ఇచ్చారు. ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని మోదీ తన చర్యల ద్వారా భయపెడుతున్నారని, అందువల్లే ఆయనను తీవ్రవాది అన్నానని ఖర్గే చెప్పారు. అయితే, ఈ మాటలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్ పార్టీ అంటూ విమర్శించింది.
ఖర్గే వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, ఇతర బీజేపీ కీలక నేతలు.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఖర్గేపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఈసీ.. ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని అభిప్రాయపడింది. ఈ నోటీసులకు 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.