BRS Party | భారత్ రాష్ట్ర సమితి దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 6 వేలు ఇవ్వాలని షిండే కేబినెట్ తీర్మానించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఇది రెండో విజయం. మొన్నటికి మొన్న జరిగిన ఔరంగబాద్ జిల్లా గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామంలో ఒకటో నంబర్ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్దార్ గఫూర్ పఠాన్ 115 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి, తొలి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే.
అయితే ఇటీవల వరుసగా మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభల్లో రైతు బంధు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ తరహాలో తమకూ రైతుబంధు ఇవ్వాలని మరాఠా రైతులు పోరాటం చేస్తున్నారు. షిండే సర్కార్పై పోరాటం చేయడమే కాకుండా.. మరాఠా రైతులు కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, భారీ స్థాయిలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయా పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు గులాబీ గూటికి చేరుకుంటున్నారు.
ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో షిండే సర్కార్ దిగిరాక తప్పలేదు. తెలంగాణ తరహాలోనే రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 6 వేలు ఇవ్వాలని షిండే కేబినెట్ తీర్మానించింది. బీఆర్ఎస్ బలోపేతమవుతున్న నేపథ్యంలో రైతులను శాంతింపజేసేదుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.