Maharashtra Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే.. మద్దతుదారులతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 39 మంది ఆయన క్యాంప్లో ఉండగా.. మరో ఎమ్మెల్యే సైతం ఆయన వర్గంలో చేరనున్నట్లు సమాచారం. అయితే, ఆ ఎమ్మెల్యే పేరుమాత్రం తెలియరాలేదు. ఆ ఎమ్మెల్యే షిండే వర్గంలో చేరిన మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 40కి పెరగనున్నది.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోబంపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీస్పై జూలై 12 వరకు కోర్టు స్టే విధించింది. మరో వైపు ఉద్ధవ్ ప్రభుత్వానికి గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ లేఖ రాశారు. లేఖలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆమోదించిన ఫైళ్లు, ఉత్తర్వులకు సంబంధించిన సమాచారాన్ని కోరారు. ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ ఫిర్యాదు మేరకు గవర్నర్ లేఖ రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆరోపిస్తూ ప్రవీణ్ దారేకర్ ఫిర్యాదు చేశారు.