ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. భేటీ అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర రెండు సోదర రాష్ట్రాలు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని అంశాలపై మేము ఏకాభిప్రాయానికి వచ్చాం. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసి పని చేస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ మంచి బంధం ఉంటుంది. ఇదే బంధాన్ని దేశాన్ని ఏకం చేయడం కోసం ఉపయోగిస్తాం. దేశ హితం కోసం కేసీఆర్ తో కలిసి నడుస్తాం. మాతో వచ్చే నేతలతో కలిసి పోరాడుతాం. విధాన పరమైన మార్పుల కోసం పోరాడుతాం. మా చర్చల్లో రహస్యమేమీ ఉండదు. దేశంలో మార్పు కోసం ఏదైనా బహిరంగంగానే చేస్తాం. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోంది. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచిది కాదు.. అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.