ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సంపాదించేందుకు రూ. 2000 కోట్లు లంచంగా ముట్టజెప్పిందని ఆరోపించారు. ఈ మొత్తం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంతకంటే ఎక్కువే చేతులు మారి ఉంటుందని ఆదివారం ట్వీట్ చేశారు. ‘శివసేన పేరు, గుర్తు కోసం రూ.2000 కోట్లు చేతులు మారినట్టు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నది. త్వరలో చాలా విషయాలు బయటకు వస్తాయి.
ఇలాంటి డీల్ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరుగలేదు’ అని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన సీఎంగా ఉన్నప్పుడు ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మద్దతుతో సీఎం పదవి దక్కించుకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉద్ధవ్, షిండే వర్గాలు పార్టీ పేరు, గుర్తుల కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలైన శివసేన షిండే వర్గమేనని, పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం ఆ వర్గానికే చెందుతాయని ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన మండుతున్న కాగడాను ఉద్ధవ్ వర్గానికి కేటాయించింది. అది కూడా త్వరలో జరుగనున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల వరకేనని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనపై ఉద్ధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పార్టీ పేరును, గుర్తులను చోరీ చేశారని ఆరోపించారు.
ఇప్పుడు షిండే ఎవరి కాళ్లపై పడ్డారు?
సీఎం పదవి కోసం ఉద్ధవ్ఠాక్రే సిద్ధాంతపరంగా బద్ద విరోధులైనవారి కాళ్లపై పడ్డారన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలను సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎవరి కాళ్లపై పడ్డారని ప్రశ్నించారు. ‘ఇప్పుడు షిండే ఎవరికాళ్లపై పడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. ప్రస్తుత సీఎంకు ఛత్రపతి శివాజీ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ పేరు కోసం లంచాలు ఇచ్చారన్న రౌత్ ఆరోపణలను షిండే వర్గంతోపాటు బీజేపీ తోసి పుచ్చాయి.
పార్టీలన్నీ కండ్లు తెరవాలి
శివసేన పార్టీ పేరు, పార్టీ చిహ్నం విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం మరో పార్టీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై అన్ని పార్టీలూ కండ్లు తెరవాలని, ఈ రోజు తమ పార్టీకి జరిగినట్టే రేపు మీకు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. హోం మంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. సీఎం పదవి కోసం ఎవరి కాళ్ల వద్ద సాగిలపడలేదని, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఒత్తిడి మేరకే ఆ పదవి చేపట్టానని ఠాక్రే వివరించారు.