భోపాల్, నవంబర్ 10: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. దీంతో చాలా మంది బయటి మార్కెట్లో అధిక ధర వెచ్చించి ఎరువుల బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో ఎరువు నిల్వలు ఉన్నప్పటికీ కోడ్ నేపథ్యంలో అవి అమ్మకానికి పనికి రాకుండా పోయాయి. ఆ బస్తాలపై ప్రధాని మోదీ ఫొటో ఉండటమే దీనికి కారణం. ఎన్నికల నిబంధనల ప్రకారం మోదీ ఫొటోను చెరిపివేయడం లేదా దానిపై పెయింట్ పూయడం వంటివి చేయడంలో అధికారులు వహించిన నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
ఓవైపు రబీ సీజన్ ఆలస్యం అవుతుందన్న ఆందోళన, మరోవైపు కనుచూపు మేరలో ఈ ఎరువుల కొరత తీరే అవకాశం కనిపించకపోవడంతో… రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కువ ధరకు ఇతర చోట్ల ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. తాజా పరిస్థితిపై భోపాల్ జిల్లా ఇంత్ఖేడి గ్రామానికి చెందిన హరి సింగ్ సైని అనే రైతు మాట్లాడుతూ తన 12 ఎకరాల భూమి కోసం కేవలం 15 బ్యాగుల డీఏపీ, ఒక బ్యాగ్ పాస్ఫేట్ మాత్రమే కొనుగోలు చేయగలిగానని తెలిపారు. ఖర్చులు 20 శాతం పెరిగి భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత కారణంగా దిగుబడి తగ్గుతుందని, వ్యవసాయంతో ఆదాయం వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఎరువుల ధరలు పెరిగాయని కొంత మంది రైతులు చెబుతున్నారు. నిపానియా గ్రామానికి చెందిన లోకేంద్ర జాట్ మాట్లాడుతూ 50 కేజీల యూరియా బ్యాగ్గా వినియోగించే దాన్ని ఇప్పుడు 45 కేజీల బ్యాగులుగా రీప్యాక్ చేశారని, అయితే ధర మాత్రం అదే ఉన్నదని పేర్కొన్నారు. రూ.1,200గా ఉండే డీఏపీ బ్యాగ్ రూ.1,365కి పెరిగిందని, అదేవిధంగా గ్రాన్యులర్ ఫెర్టిలైజర్ ధర రూ.310 నుంచి రూ.468కి ఎగబాకిందని, ఇది సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఎరువుల కోసం రైతులు ఐదు గంటలకు పైగా క్యూల్లో నిలబడుతున్నారు.
రైతులను మోసం చేస్తున్న బీజేపీ
రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, పంపిణీ కేంద్రాల వద్ద పెద్ద క్యూలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మతా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఓ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ బీజేపీ రైతులను మోసం చేస్తున్నదని, వారి కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు.