(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది. ఎరువుల కొరత కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రైతన్నలు మృత్యువాత పడుతుండటం నిత్యకృత్యమవుతున్నది.
సీఎం శివరాజ్సింగ్ సొంత జిల్లా సెహోర్లోని ఇచ్చావార్కు చెందిన 58 ఏండ్ల శివనారాయణ్ మేవాడా అనే రైతు.. ఎరువుల కోసం మూడురోజులుగా లైన్లో నిలబడి.. చివరకు వాటిని తీసుకోకుండానే గుండెపోటుతో ఇటీవల మరణించాడు. గుణ జిల్లాలోని గోయల్హీడా గ్రామానికి చెందిన రావ్ుప్రసాద్ (38) ఈ నెల 20న ఎరువుల కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఎరువుల కోసం 3, 4 రోజులు క్యూలో నిలబడాల్సి వస్తున్నదని అన్నదాతలు మండిపడుతున్నారు. అయినప్పటికీ, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయడంలేదని వాపోతున్నారు. దీంతో 20-30 శాతం అధిక ధర చెల్లించి బ్లాక్మార్కెట్లో ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తున్నట్టు మండిపడ్డారు.
మధ్యప్రదేశ్లో 74.73 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. యాసంగి సీజన్లో 22-23లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 11-12 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 3-4 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే ఎరువుల డిమాండ్ ఉంటుంది. అయినప్పటికీ, ముందుచూపు లేని ప్రభుత్వ విధానాలతో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులపాలవుతున్నారు. ఏటా యాసంగి సీజన్లో ఎరువులకోసం రోడ్లను దిగ్బంధించడం, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతోనే సరిపోతున్నదని అన్నదాతలు వాపోతున్నారు.