చెన్నై, ఏప్రిల్ 15: ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల నిరసనను ప్రకటించారు. తమిళనాడులో నల్ల జెండాల నిరసన జరుగుతుందని ఓ వీడియో సందేశంలో స్టాలిన్ తెలిపారు. కేంద్రం తెస్తున్న బిల్లుతో తమిళనాడు, దక్షిణాది చారిత్రక అన్యాయమే అని మండిపడ్డారు. తమిళనాడు గొంతుక వినుకపోతే కేంద్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులోని ప్రతి కుటుంబం తమ నిరసనను తెలియచేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. రేపు(గురువారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు నిరసనగా మన ఇండ్లలో, బహిరంగ ప్రదేశాలలో నల్ల జెండాలను ప్రదర్శిద్దామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్పై రాజ్యాంగ సవరణ బిల్లును నల్ల చట్టంగా ఆయన అభివర్ణిస్తూ ఈ బిల్లు భారతదేశాన్ని చీకటి యుగంలోకి తీసుకువెళుతుందని అన్నారు.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగరాదని స్టాలిన్ హెచ్చరించారు. ఈ ప్రక్రియ ఉత్తరాది రాష్ర్టాలకు మేలుచేస్తుందని, ఇక దక్షిణాది రాష్ర్టాల అవసరం కేంద్రానికి ఉండదని ఆయన చెప్పారు. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి ఇదేనా కేంద్రం విధించే శిక్షా అని ఆయన ప్రశ్నించారు. దేశ సంక్షేమం కోసం నిలబడినందుకు దక్షిణాది రాష్ర్టాల హక్కులను మీరు లాక్కుంటారా అని ఆయన బీజేపీని నిలదీశారు. మరోవైపు పార్టీ ఎంపీలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.