లక్నో: యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లోని కమర్షియల్ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్లో గ్రౌండ్ఫ్లోర్లో పెంపుడు జంతువుల దుకాణంతో పాటు పై అంతస్తుల్లో కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్ ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో మొదట భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి కాస్తా పై అంతస్తుల్లో ఉన్న కోచింగ్ సెంటర్కు ఎగబాకాయి. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టేయడం, పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో విద్యార్థులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి కిందికి దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఇలా దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ వారికీ గాయాలయ్యాయి. ఒక వ్యక్తి పగిలిన కిటికీలోంచి దూకుతున్న వీడియో వైరల్ అయింది. అతను నేరుగా కిందపడిపోగా.. స్థానికులు కాపాడారు. ఇంకొందరు దగ్గర్లోని తీగలను పట్టుకుని బయటపడే ప్రయత్నం చేస్తూ కింద పడిపోయారు. ఇలా కిందికి దూకిన విద్యార్థులను స్థానికులు వెంటనే దవాఖానలకు తరలించారు. కానీ దూకడానికి భయపడి చాలా మంది బిల్డింగ్లోనే చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.
తాము దూకమని చెప్పినా ఆగిపోయారని.. చివరకు మంటల్లో కాలిపోయారన్నారు. 14 ఫైర్ ఇంజిన్లు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. అగ్ని ప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఫైర్ ఇంజిన్లు వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నారు. బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆ ఏరియా మొత్తం పొగతో నిండిపోయింది. ఈ ఘటనపై వైద్యాధికారి అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 15 మంది చనిపోయారని, 22 మంది పిల్లలను హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. కిందికి దూకిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని.. అందులో ఇద్దరికి వీపు భాగంలో గాయాలయ్యాయని వెల్లడించారు.
ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల సాయం ప్రకటించారు. యూపీ సీఎం ఆదిత్యానాథ్ మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.