MGNREGA | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు అసమతుల్యంగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి, వేతనాలకు పొంతన లేదని తెలిపింది. ఈ కారణంగా ఈ పథకంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నదని వెల్లడించింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న వేతనాల్లో భారీ తేడా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.
‘మధ్యప్రదేశ్లో రూ.221, సిక్కింలోని మూడు గ్రామపంచాయతీల్లో రూ.354, అండమాన్లో రూ.311 వేతనంగా ఇస్తున్నారు’ అని కమిటీ పేర్కొంది. 2008 నుంచి ఈ పథకంలో అమలు చేస్తున్న వేతనాలను పరిశీలించిన కమిటీ… పెరుగుతున్న జీవన వ్యయానికి అవి సరిపోవని తెలిపింది. కనీస వేతనాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఉపాధి హామీ పథకంలో ఒక రోజుకు రూ.375 వేతనంగా ఇవ్వాలని ప్రతిపాదించిందని గుర్తు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ వేతనాలను పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఉపాధి హామీ వేతనాలను గణిస్తున్న పద్ధతి ప్రస్తుతం వాడుకలో లేదని తెలిపింది. ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్లోనూ అసమతుల్యత కనిపిస్తున్నదని కమిటీ చెప్పింది. ప్రస్తుత దేశ బడ్జెట్లో ఈ పథకానికి నిధులు తగ్గించడం కలవరం కలిగిస్తున్నదని.. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది.