Lok Sabha : పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల (Monsoon session) లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమావేశాలు మొదలై మూడు రోజులైనా ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదాపడుతూ వస్తున్నాయి. మూడో రోజైన బుధవారం కూడా ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు.
ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలవగానే.. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు.
ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని వారు విమర్శించారు. దాంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి.
ఆ తర్వాత సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ లోక్సభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు డిమాండ్ చేశారు. ఫలితంగా సభలో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదాపడింది.